National

బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు

రచన: Kashi9 నిమిషాల పఠనం

‘బియాండ్‌ బెంగళూరు’ పేరుతో కర్ణాటక డిజిటల్‌ ఎకానమీ మిషన్‌ ఇప్పటికే ఆ దిశగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. అంటే ఇక కర్ణాటక గ్రోత్‌ స్టోరీ అంటే బెంగళూరు ఒక్కటే కాదు. మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి–ధార్వాడ్‌, బెలగావి, కలబురగి, తుమకూరు, శివమొగ్గ వంటి నగరాలు కూడా తమదైన రంగాల్లో కొత్త కేంద్రాలుగా మారాలన్నదే లక్ష్యం.

బెంగళూరు అంటే ఐటీ..!

బెంగళూరు అంటే స్టార్టప్‌లు..!

బెంగళూరు అంటే లక్షలాది ఉద్యోగాలు..!

ఇన్నాళ్లూ కర్ణాటక అభివృద్ధి కథను చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది బెంగళూరే. కానీ ఇప్పుడు ఈ కథలో ఓ కీలకమైన మార్పు కనిపిస్తోంది. బెంగళూరు ఒక్కటే ఎందుకు..? రాష్ట్రంలోని మిగతా నగరాలు ఎందుకు ఎదగకూడదు? ఇదే ప్రశ్నకు సమాధానంగా కర్ణాటక ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది.

బెంగళూరులో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌, భూమి ధరలు, ఆఫీసుల అద్దెలు, మౌలిక వసతులపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనే ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబడులు సృష్టించాలన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఆలోచన. ‘బియాండ్‌ బెంగళూరు’ పేరుతో కర్ణాటక డిజిటల్‌ ఎకానమీ మిషన్‌ ఇప్పటికే ఆ దిశగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది.

అంటే ఇక కర్ణాటక గ్రోత్‌ స్టోరీ అంటే బెంగళూరు ఒక్కటే కాదు. మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి–ధార్వాడ్‌, బెలగావి, కలబురగి, తుమకూరు, శివమొగ్గ వంటి నగరాలు కూడా తమదైన రంగాల్లో కొత్త కేంద్రాలుగా మారాలన్నదే లక్ష్యం.

బెంగళూరుకు ప్రత్యామ్నాయం కాదు.. మరో బెంగళూరుల సమూహం!

ఇక్కడ ప్రభుత్వం ఆలోచిస్తున్నది బెంగళూరును వెనక్కి నెట్టడం కాదు. బెంగళూరు విజయాన్ని ఇతర నగరాల్లోకి విస్తరించడం. కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. జూలైలో సీఎం డీకే శివకుమార్‌ విజన్‌ బియాండ్‌ బెంగళూరు పేరుతో ఇతర నగరాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే కొత్త విధానాన్ని ప్రకటించారు. బెంగళూరు వెలుపల తక్కువ ఖర్చుతో కార్యాలయ మౌలిక వసతులు అందించి కంపెనీలను ఆకర్షించాలన్న ఆలోచనను ఆయన ముందుకు తెచ్చారు. ఇప్పుడు అసలు ప్రశ్న.. బెంగళూరు స్థానాన్ని భర్తీ చేయబోయే నగరాలు ఏవి?

మైసూరు.. బెంగళూరుకు దగ్గర్లో మరో టెక్‌ హబ్‌!

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది మైసూరు. ఇప్పటికే విద్య, పర్యాటకం, ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైసూరు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఐటీ–ఐటీఈఎస్‌, ఎలక్ట్రానిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు, స్టార్టప్‌లను మరింతగా ఆకర్షించాలన్నది ప్రభుత్వ వ్యూహం.

2030 నాటికి మైసూరును భారీ డిజిటల్‌ ఎకానమీ క్లస్టర్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విజన్‌లో మైసూరుకు 10 బిలియన్‌ డాలర్ల డిజిటల్‌ ఎకానమీ, 1.5 లక్షలకు పైగా డిజిటల్‌ ఉద్యోగాల లక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. దక్షిణ కర్ణాటకలోనే మరో టెక్‌ ఎకోసిస్టమ్‌ తయారు చేయ‌నున్నార‌న్న‌మాట‌.

మంగళూరు.. తీర ప్రాంతానికి టెక్‌ టచ్‌

మరోవైపు మంగళూరుకు పూర్తిగా భిన్నమైన బలం ఉంది. పోర్టు, విద్య, వైద్యం, బ్యాంకింగ్‌, పరిశ్రమలు వంటి రంగాల్లో ఇప్పటికే బలమైన పునాది ఉన్న ఈ నగరాన్ని ఐటీ, ఫిన్‌టెక్‌, డేటా ఆధారిత పరిశ్రమలు, డిజిటల్‌ ఎకానమీ వైపు తీసుకెళ్లాలని ప్రభుత్వం చూస్తోంది.

అందుకే మంగళూరును కేవలం తీర ప్రాంత వాణిజ్య నగరంగా కాకుండా ‘సిలికాన్‌ బీచ్‌’ తరహా టెక్నాలజీ క్లస్టర్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉత్తర కర్ణాటకకు కొత్త పారిశ్రామిక ముఖచిత్రం

హుబ్బళ్లి–ధార్వాడ్‌, బెలగావి ప్రాంతాలపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇంజినీరింగ్‌, తయారీ, ఎలక్ట్రానిక్స్‌, ఏఐ, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్టార్టప్‌లకు ఈ ప్రాంతాన్ని కీలక క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక్కడ ఒకే నగరాన్ని కాకుండా హుబ్బళ్లి–ధార్వాడ్‌–బెలగావిని ఒక ఆర్థిక కారిడార్‌గా చూడటం ప్రత్యేకత. హుబ్బళ్లిని ఏఐ–టెక్నాలజీ వైపు, బెలగావిని ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌, తయారీ రంగాల వైపు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంది.

కలబురగి.. తుమకూరు.. శివమొగ్గ

ఇక ఇప్పటివరకు పెద్దగా టెక్‌ మ్యాప్‌లో కనిపించని కలబురగి, తుమకూరు, శివమొగ్గలకు కూడా కొత్త పాత్ర ఇవ్వాలని కర్ణాటక చూస్తోంది.

తుమకూరును పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్‌ సంబంధిత కార్యకలాపాలకు అనువైన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కలబురగిని షేర్డ్‌ సర్వీసులు, బీపీఓ, టెక్నాలజీ, పరిశ్రమల పెట్టుబడులకు అనువైన కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచన ఉంది. శివమొగ్గలో హెల్త్‌కేర్‌, అగ్రిటెక్‌ వంటి రంగాలకు అవకాశాలను పెంచే ప్రయత్నాలు సాగుతున్నాయి.

అంటే ప్రతి నగరాన్ని బెంగళూరులా మార్చడం కాదు. ఆ నగరానికి ఉన్న బలాన్ని గుర్తించి.. దానికి తగ్గ పరిశ్రమలను తీసుకురావడం.

అసలు పరీక్ష ఇక్కడే..

అయితే ఈ ప్లాన్‌ వినడానికి ఎంత బాగుందో.. అమలు చేయడం అంత సులభం కాదు. కంపెనీలను ఆకర్షించడం ఒక ఎత్తు. వాటిని అక్కడే కొనసాగించడం మరో ఎత్తు. పెట్టుబడులు ప్రకటించడం ఒక ఎత్తు. వాటి ద్వారా స్థానిక యువతకు నిజంగా ఉద్యోగాలు రావడం మరో ఎత్తు.

ఇప్పటికే ‘బియాండ్‌ బెంగళూరు’ కార్యక్రమంలో మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి–ధార్వాడ్‌ వంటి ప్రాంతాల్లో కంపెనీలు, ఉద్యోగాలు వచ్చాయి. అయితే రాష్ట్రం ఇప్పుడు నిర్దేశిస్తున్న లక్ష్యాలు గతంతో పోలిస్తే మరింత పెద్దవి.

అందుకే ప్రభుత్వం మౌలిక వసతులు, టాలెంట్‌, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌, సింగిల్‌ విండో అనుమతులు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోంది. 2026 ఆగస్టులో డీకే శివకుమార్‌ బెంగళూరు వెలుపల పారిశ్రామిక అభివృద్ధి కోసం నగరాలను గుర్తించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్ర‌స్తుతం కర్ణాటక ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఒక్కటే. బెంగళూరుపై ఉన్న అభివృద్ధి భారాన్ని తగ్గించడం.. అదే సమయంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాలను పంచడం. ఇన్నాళ్లూ బెంగళూరు వెళ్లాలి.. ఉద్యోగం తెచ్చుకోవాలి అనే పరిస్థితి ఉంటే.. రేపు మన నగరంలోనే మంచి ఉద్యోగం ఉంది అనే పరిస్థితి రావాలన్నదే ఈ ‘బియాండ్‌ బెంగళూరు’ ఆలోచన.

బెంగళూరు కర్ణాటకకు గ్రోత్‌ ఇంజిన్‌గా మారింది. ఇప్పుడు ఆ ఇంజిన్‌ ఒక్కటే ఉండకూడదనేది ప్రభుత్వ ఆలోచన. మైసూరు నుంచి మంగళూరు వరకు.. హుబ్బళ్లి నుంచి కలబురగి వరకు.. ఇక కర్ణాటక అభివృద్ధి కథలో బెంగళూరుతో పాటు ఆ నగరాల పేర్లు కూడా వినిపించబోతున్నాయి.

#Karnataka#Bengaluru#Beyond Bengaluru#DK Shivakumar#Karnataka Development#Mysuru#Mangaluru#Hubballi Dharwad#Belagavi#Kalaburagi#Tumakuru#Shivamogga#Karnataka Cities#IT Hubs#Karnataka Economy#Jobs#Investments#Industrial Growth#Technology Hubs#Bengaluru Traffic#Karnataka Government#Business Growth#Infrastructure#Digital Economy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి