విద్యాలయాలు అక్షర రూపం దాల్చిన ఆలయాలు.. అవి కేవలం నాలుగు గోడల మధ్య నడిచే తరగతి గదులు కావు.. నవ సమాజ నిర్మాణానికి పునాదిరాళ్ళు, ప్రతిధ్వనించే అభ్యుదయ ఆలోచనలకు పవిత్ర వేదికలు.. మంచి నడవడికను, మానవీయ విలువలను తెలిపే పవిత్ర ఆశ్రమాలు..
క్రమశిక్షణ అనే కవచాన్ని తొడిగి, బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే సంస్కార నిలయాలు విద్యాలయాలు.. ఇలాంటి చోట పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు అజ్ఞానపు నిశీధిలో జ్ఞాన సూర్యోదయాలు.. బ్రతుకు వెనుక ఉన్న పరమార్ధాన్ని నేర్పే జీవిత మార్గదర్శకులు.. అందుకే మాస్టర్లకు గురుస్థానాన్ని ఇచ్చింది మన సమాజం..
కానీ, నేడు ఉపాధ్యాయ వృత్తికే కళంకంగా మారుతున్నారు కొందరు ఉపాధ్యాయులు.. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది మృగాళ్ల వల్ల ఆ అక్షర ఆలయాలు భయానికి, అభద్రతకు నిలయాలుగా మారుతున్నాయి. అభయమివ్వాల్సిన గురుస్థానంలో ఉన్నవారే ఆరాచకానికి ఒడిగడితే, ఆడపిల్లల మానసిక వేదన ఇంకెవరూ గుర్తిస్తారు?.. ఇక ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్న వెలుగులోకి వస్తున్నవి తక్కువే..

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఘటన జరిగి సుమారు 20 రోజులు దాటినప్పటికీ, ఈ వ్యవహారాన్ని కొందరు కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మెదక్ జిల్లా పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు నర్సింలుపై కొందరు విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమతో వెకిలిగా ప్రవర్తించడంతో పాటు, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారని విద్యార్థినులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై పలువురు విద్యార్థినులు ఇతర ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, చైల్డ్ హెల్ప్లైన్ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అధికారుల విచారణ పరిధిలో ఉన్నట్లు సమాచారం.
తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే బయటకు చెప్పుకోలేక కొందరు విద్యార్థినులు పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వారి ఎదుట కన్నీటి పర్యంతమైన బాలికలు.. తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై అధికారులు చేపడుతున్న విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
మరోవైపు ఈ టీచర్ నికృష్టపు చేష్టలను గోప్యంగా ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ వ్యవహారాన్ని దాచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుడిని ప్రధానోపాధ్యాయుడు వెనకేసుకొస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ఘటనతో ప్రభుత్వ పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. విద్యార్థినిలు ఇలాంటి కీచక టీచర్లపై ఆరోపణలు చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై ఎలాంటి రాజకీయ, శాఖాపరమైన ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాత విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు..
బాలికల భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వకూడదని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పూర్తిగా పరిశీలించి, ఆరోపణలు వాస్తవమని దర్యాప్తులో తేలితే సదరు టీచర్ నర్సింలుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అంతేకాదు, ఈ వ్యవహారాన్ని తొలుత ఎందుకు గోప్యంగా ఉంచారు? విద్యార్థినుల ఫిర్యాదులపై సకాలంలో ఎందుకు స్పందించలేదు? అనే ప్రశ్నలకు కూడా అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.









