మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆమె దూరంగా ఉన్నారు. దీంతో కొండా సురేఖ ఏం చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? పార్టీలో ఉంటారా? వేరే పార్టీలోకి వెళ్తారా? అనే చర్చ మరోసారి మొదలైంది. మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించాకా? ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికలకు తెరలేపుతారని అంతా భావించారు. కానీ, ఆమె మాత్రం పదవికి రాజీనామా చేయబోనని..కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.
అయితే, రెండ్రోజుల తర్వాత ఫేస్బుక్లో ఆసక్తికర పోస్టు పెట్టారు. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని, వెయిట్ చేయాలని కోరారు. కానీ, ఇప్పటివరకు ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.కానీ, ఆమె సీఎల్పీ సమావేశానికి, సెషన్స్కు సైతం హాజరుకాలేదు. అసెంబ్లీ ప్రారంభం రోజున బీఆర్ఎస్ సభ్యులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ, కొండా సురేఖ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. కానీ, ప్రకటన కూడా విడుదల చేయలేదు. దీంతో ఆమె పార్టీకి, పార్టీ కార్యక్రమాలు అంటిముట్టనట్టు వ్యహరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు ఫోన్ చేసినట్టు తెలిసింది.అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండాలని ఆదేశించినట్టు సమాచారం.దానికి కూడా ఆమె సరిగా స్పందించలేదని తెలుస్తోంది.
ఇదిలాఉండగా, కొండా సురేఖ పార్టీ మీద, సీఎం రేవంత్, కీలక నేతల మీద అలకబూనినట్టు అధిష్టానం గుర్తించినట్టు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను కేబినెట్ నుంచి తప్పించడంతో బీసీలు రివర్స్ అయ్యే చాన్స్ ఉందని హైకమాండ్కు నివేదికలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొండా సురేఖకు కీలక పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచన చేసినట్టు తెలుస్తోంది. TPCC అధ్యక్షురాలిగా ఆమెకు అధిష్టానం బాధ్యతలు అప్పగించనుందని సమాచారం. ఈ విషయంపై చర్చలు జరిపేందుకే.. హస్తినకు రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా కొనసాగుతున్న మహేశ్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుని.. కొండాను పీసీసీ చీఫ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.కాగా, కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి అధిష్టానం తొలిగించిన విషయం తెలిసిందే.











