ఇండోనేషియాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక అకస్మాత్తుగా గల్లంతయ్యింది. దీంతో వందల మంది నడిసంద్రంలో గల్లంతు అయినట్టు సమాచారం. విషయం తెలియడంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
వివరాల్లోకివెళితే.. ఇండోనేషియా తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ కలిమంతన్ ప్రాంతంలోని బంజర్మసిన్కు ప్రయాణికులతో బయలుదేరిన విర్గో ట్రాన్స్పోర్ట్ 8 నౌక అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంది. సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్స్ కోల్పోయి, కమ్యూనికేషన్ కట్ అయినట్టు తెలిసింది. ఆ సమయంలో నౌకలో సుమారు 240 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తూర్పు జావా ప్రావిన్స్ నుంచి స్టార్ట్ అయిన ఈ షిప్కు మార్గమధ్యలో ప్రతికూల వాతావరణం ఎదురైనట్టు సమాచారం. బంజర్మసిన్లోని ప్రధాన కేంద్రానికి సుమారు 148 కి.మీ దూరంలో జావా సముద్రంలో ఉండగా నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా రెస్క్యూ అధికారులు వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బంజర్మసిన్లోని త్రిశక్తి పోర్టు కేంద్రంగా ప్రత్యేక ఆపరేషన్ రూమ్ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటివరకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు 102 మందిని రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. గల్లంతైన మిగతా ప్రయాణికుల కోసం నేవీ, రెస్క్యూ బోట్లు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నౌకలోని ప్రజలను గుర్తించి వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో సహాయకచర్యలకు ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది.










