రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ 1000 రోజుల పాలన సంబరాలకు సిద్దం అవుతుంటే.. అధికార పక్షంపై పొలిటికల్ వార్ కు బీఆర్ఎస్ సిద్దం అయ్యింది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్.. విపక్షంగా తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మక పోరాటానికి సమరశంఖం పూరించింది. ఇప్పటివరకు అసెంబ్లీ వేదికగా, ప్రజా సమస్యలపై సాగించిన పోరాటాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ కార్యాచరణను ప్రకటించింది.
ప్రజా ప్రభుత్వం లోపాలను ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు ఏడు రోజుల కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పోరాటంలో భాగంగా నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా.. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదలకు సిద్దం అయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలు తీరుపై ప్రశ్నలు సంధించడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. కేవలం చార్జ్షీట్ విడుదలతో సరిపెట్టకుండా.. ఏ హామీ ఎంత మేర అమలైంది, ఏది అమలు కాలేదు, ప్రజలకు ఎంత నష్టం జరిగిందన్న అంశాలను వివరిస్తూ బాకీ కార్డులు రూపొందించి ప్రతి గడపకు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ నాయకత్వం.. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అలాగే రైతు భరోసా, రైతు రుణమాఫీ, సాగునీరు, ఎరువుల సమస్యలతోపాటు ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్దం అవుతుంది.
ఈ క్రమంలో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నిరసనలు చేపట్టి స్థానిక సమస్యలను కూడా ఈ ఉద్యమంలో భాగం చేయాలనే భావనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏడు రోజుల ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో ఏదో ఒకచోట భారీ బహిరంగ సభ నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసేందుకు విడివిడి నిరసనలను కాకుండా, సమగ్ర పొలిటికల్ మూవ్మెంట్గా మార్చేందుకు BRS వ్యూహరచన చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వరుస టెలీకాన్ఫరెన్సులతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, పొలిటికల్ అటాక్కు లైన్ క్లియర్ చేశారు.
బీఆర్ఎస్ లో నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు.. వరుసగా ఎదుర్కొన్న ఓటమిలతో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు, ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ దూకుడు రాజకీయాన్ని నడపడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.. ఇక సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయడంలో బీఆర్ఎస్ ఏమాత్రం సఫలం అవుతుందో చూడాలనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్లో నెలకొంది..









