తనను ‘పరారీలో ఉన్న వ్యక్తి’ (Fugitive) అంటూ సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న విమర్శలపై ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఘాటుగా స్పందించారు. తాను కావాలని బ్రిటన్లో ఉండిపోలేదని, చట్టపరమైన ఆంక్షల వల్లే భారత్కు తిరిగి రాలేకపోతున్నానని స్పష్టం చేశారు. 1992 నుంచి తనకు బ్రిటన్లో శాశ్వత నివాస హక్కు ఉందని వెల్లడిస్తూ, ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం తన పట్ల ప్రవర్తించిన తీరు అత్యంత తీవ్ర అన్యాయమని సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా ఆరోపించారు.
భారీ నష్టాల్లో కూరుకుపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బ్యాంకుల కన్సార్టియంకు దాదాపు రూ.9వేల కోట్ల బకాయిలు పడటంతో 2016 మార్చిలో విజయ్ మాల్యా భారత్ విడిచి బ్రిటన్ వెళ్లారు. దీంతో 2019లో ముంబై ప్రత్యేక కోర్టు ఆయనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. మాల్యాను తిరిగి దేశానికి తీసుకురావడానికి 2017లో భారత ప్రభుత్వం బ్రిటన్ను అధికారికంగా కోరగా, అదే ఏడాది లండన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ లభించినప్పటికీ, బ్రిటన్ విడిచి వెళ్లకూడదనే కఠిన షరతులను అక్కడి కోర్టు విధించింది.
భారత్కు అప్పగించాలన్న లండన్ దిగువ కోర్టు తీర్పును మాల్యా హైకోర్టులో సవాల్ చేసినా విజయం దక్కలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా అనుమతి నిరాకరించబడింది. అయితే ఆయన అప్పగింతకు అడ్డుగా అక్కడొక గోప్యమైన న్యాయపరమైన ప్రక్రియ (Confidential Legal Matter) పెండింగ్లో ఉందనే సమాచారాన్ని భారత ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు సమర్పించింది. మరోవైపు తన పాస్పోర్టు రద్దయిందని, లండన్ కోర్టు నిబంధనల ప్రకారం ఇంగ్లండ్, వేల్స్ దాటి ఎటువైపు వెళ్లేందుకు తనకు చట్టపరమైన అనుమతి లేదని మాల్యా వాదిస్తున్నారు.
ఇటీవల బాంబే హైకోర్టులో జరిగిన విచారణలో మాల్యా తరఫు న్యాయవాదులు కీలక విషయాలను వెల్లడించారు. కింగ్ఫిషర్కు సంబంధించి బ్యాంకులు తమకు రావాల్సిన అసలు బకాయిల కంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే జప్తులు, ఆస్తుల వేలం ద్వారా రికవరీ చేసుకున్నాయని వాదించారు. ఈ అంశంపై పూర్తి వివరాలతో స్పందించాలని ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ను బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ న్యాయపోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.












